Thursday, April 29, 2010

ఏర్చి, కూర్చి, మార్చి వ్రాసిన బైబుల్ గ్రంధం ఎలా నమ్ముతున్నారు!

ప్రశ్నోత్తరాల  పరంపరలో మరికొన్ని...
హిందూ జాగరణ సమితి ప్రశ్న (7) :
మీ పవిత్ర గ్రంధం బైబిలును ఒక వ్యక్తి రాయలేదని, అనేకమంది, అనేక కాలాల్లో, అనేక భాషల్లో ఏర్చి, కూర్చి, మార్చి వ్రాసిన గ్రంథమని మీకు తెలుసా! మీ గ్రంధం క్రీస్తు తదుపరి సుమారు నాలుగు దశాబ్దాల కాలం తరువాత వెలువడిందని మీకు తెలుసా! అన్ని వందల సంవత్సరాలు ఎందుకు పట్టిందో చెప్పగలరా!
క్రైస్తవ పరిషత్ సమాధానం :
మా పవిత్ర గ్రంధం అయిన బైబుల్ ఎలా వ్రాయబడిందో మాకే తెలియదని జాగరణ సమితి వారు భావించటం వారి గొప్ప "జ్ఞానానికి" తార్కాణం!
మహాశయులారా! మా పరిశుద్ధ గ్రంధమైన బైబుల్ ఒకే పుస్తకం కాదు. అది 66 పుస్తకాల సంకలనం. 1,600 ఏళ్ళ పాటు, వేరు వేరు దేశాలలో, ఒకరితోనోకరికి ఏమాత్రమూ పరిచయం లేని 40 మంది ప్రవక్తల ద్వారా హెబ్రీ, గ్రీకు, అరామిక్ భాషలలో వ్రాయబడిన 66 గ్రంధాలను కలిపి ఒక గ్రంధంగా కూర్చి చూస్తే, పూసల దండలో దారం ఉన్నట్లు ఆ 66 గ్రంధాలలో ఒకే సందేశం ప్రవహిస్తూ ఉండటం మేము గమనించాము. బైబుల్ దైవ గ్రంథమని మేము నమ్మడానికి ఇది కూడ ఒక కారణం.
ఆ 40 మంది ప్రవక్తలనూ ఒకానొక మానవాతీత దైవశక్తి నడిపించి వ్రాయించిందని మాకు నిరూపణలు దొరికాయి. బైబుల్లోని మొదటి గ్రంధం క్రీస్తు పూర్వం 1500 ఏళ్ళనాడు వ్రాయబడింది. చివరి పుస్తకం క్రీస్తు శకం నూరేళ్ళ నాడు వ్రాయబడింది.
హిందూ జాగరణ సమితి ప్రశ్న (8) :
ఇన్ని తప్పులు దొర్లినా మీ గ్రంధాన్ని ఇంకా దేవుని వాక్కుగా మీరు నమ్ముతున్నారా!
క్రైస్తవ పరిషత్ సమాధానం :
ఏం తప్పులు దొర్లాయి మహాశయా?! ఎక్కడ తప్పులు దొర్లాయో బైబుల్లో వచనాలను చూపించకుండానే " - ఇన్ని తప్పులు దొర్లినా" అంటున్నారంటే, ఏలినవారి ఉబలాట మంతా క్రైస్తవ్యాన్ని దూషించటంలోనే ఉన్నదని అర్ధమౌతున్నది.
హిందూ జాగరణ సమితి ప్రశ్న (9) :
మీరు దాన్ని దేవుని వాక్కుగా నమ్మితే మీ దేవునికి ఈ చిన్న విషయాలు ఎందుకు తెలియకుండా పోయాయి!
క్రైస్తవ పరిషత్ సమాధానం :
అసలు బైబులులో శాస్త్రవిరుద్ధమైన విషయాలు లేనే లేవని మీము ఇదివరకే స్పష్టికరించాము గనుక "మీ దేవునికి ఈ చిన్న విషయాలు తెలియకుండా ఎందుకు పోయాయి?" అన్న ప్రశ్నే ఇక్కడ అసంగతమూ, అర్ధరహితమూ అయిపొయింది.
పైపెచ్చు "మీ దేవుడు" అన్న పదప్రయోగమే అత్యంత అభ్యంతరకరం. ఏ దేవుడు హిందువులను సృష్టించాడో, ఆ దేవుడే క్రైస్తవులను, ముస్లింలను సృష్టించాడని మా ప్రగాఢ విశ్వాసం అందుచేత మీ దేవుడు, మా దేవుడు అంటూ మాట్లాడటం అత్యంత అభ్యంతరకరం. అలాంటి పదప్రయోగం పండితులకు యోగ్యమైనది కాదు.
(మీ సమయాన్ని వెచ్చించి ఓపిగ్గా చదివిన మీకు ప్రత్యేక ధన్యవాదాలు. అందుబాటులో లేని వారికోసం ఇంకా మరికొన్ని మరలా కలిసాక)

Monday, April 26, 2010

శాస్త్రవేత్తలను చంపిన ఘనత ఎవరిది!

ప్రస్నోత్తరాల పరంపరలో మరికొన్ని... (శాస్త్రవేత్తలను చంపిన ఘనత ఎవరిది!)
 హిందూ జాగరణ సమితి ప్రశ్న :
సూర్యుని చుట్టూ భూమి తిరుగు చున్నది కానీ భూమి చుట్టూ సూర్యుడు తిరుగుట లేదు అని యదార్ధం చెప్పినా బైబులుకు వ్యతిరేకంగా ఉందని కోపర్నికస్, గెలీలియోల వంటి శాస్త్రజ్ఞులను హింసించి, అదే మాట అన్నందుకు బ్రూనో అనబడే శాస్త్రజ్ఞుని ఆరు సంవత్సరాలు  జైల్లో పెట్టి, అతి కిరాతంగా హింసించి, చివరకు సజీవ దహనం చేసిన ఘనత మీ మతానిది కాదా!
క్రైస్తవ పరిషత్ సమాధానం :

"భూమి చుట్టూ సూర్యుడు తిరుగుచున్నాడు" అని బైబుల్లో ఎక్కడా చెప్పబడలేదు. సుర్యకేంద్రక సిద్ధాంతం బైబుల్ కు వ్యతిరేకం కాదు. కోపర్నికస్, గెలీలియోలు కనుగొన్న సుర్యకేంద్రక సిద్ధాంతం ఆనాటి మత పెద్దలు తమ అధికారాన్ని దుర్వినియోగం చేసుకున్న ఉదంతం అది. ఆ తప్పు క్రైస్తవ మతానిది కాదు, కొందరు నకిలీ క్రైస్తవులది.
ఇలాగే మత పెద్దలు తమ నిరకుశ అధికారాన్ని ఉపయోగించి అమాయకులను, నిర్దోషులను, సజ్జనులను హింసించి చంపిన ఉదంతాలు అన్ని మతాలలోను ఉన్నాయి. అలాంటి దురదృష్టకర సంఘటనలు ఆధారం చేసుకొని మతాన్ని  దూషించటం, ద్వేషించటం తెలివితక్కువపని. అన్ని మతాలు గొప్పవే! అయితే అన్ని మతాలలోను ఆ మతాల సారం ఎరుగని నకిలీ భక్తులు ఉన్నారు.
హిందూ జాగరణ సమితి ప్రశ్న :

చివరికి ఆ శాస్త్రజ్ఞులు చెప్పినదే నిజమేనని మీ మతం  1820 సంవత్సరంలో ఒప్పుకుంది. అప్పుడు మీ మత గ్రంధం యొక్క పరువు ఏమయ్యింది!
క్రైస్తవ పరిషత్ సమాధానం :

కోపెర్నికస్, గెలీలియోలను చర్చి అధికారులు దోషులుగా తీర్పు తీర్చినప్పుడు వారు బైబిలులోని వచనాలను ఆధారంగా చూపించలేదు - గనుక తరువాత చర్చి అధికారులు తమ అభిప్రాయాలను మార్చుకున్నప్పుడు చర్చి అధికారుల  పరువే  పోయింది.  బైబిల్ గ్రంధం   యొక్క పరువుకు  వచ్చిన  నష్టం ఏమీ లేదు!
హిందూ జాగరణ సమితి ప్రశ్న :
పురుషునికి ఎడమవైపు ప్రక్కటెముకలు, కుడి వైపు ప్రక్కటెముకల కన్నా ఒకటి తక్కువ ఉంటాయని  మీ మత గ్రంధం చెప్పింది. అది నిజం కాదని, రెండు వైపులా ప్రక్కటెముకలు సమంగా ఉంటాయని నిరూపించినందుకు వెసాలియన్ అనబడే శాస్త్రజ్ఞుని శిక్షించి అతని చావుకు కారణభూత మైనది మీ మతం కాదా!
క్రైస్తవ పరిషత్ సమాధానం :

"ప్రతి పురుషునికి ఒక వైపు ప్రక్కటెముక తక్కువగా ఉంటుంది" అని బైబుల్ గ్రంధంలో ఎక్కడా వ్రాయబడలేదు. హిందూ జాగరణ సమితి వారు బైబుల్ ను గూర్చి ఏమీ తెలుసుకోకుండానే విమర్శకు బయలుదేరారు. జాగరణ సమితి వారు ఈవిషయంలో మొదట మేల్కొనటం మంచిది.
ప్రతి విషయానికీ "ఈ తప్పు మీ మతానిది కాదా?" అంటూ ఒంటికాలిమీద లేస్తున్న జాగరణ సమితి వారు ఒక విషయాన్ని తెలుసుకోవాలి. ప్రతి తరం లోనూ మతపెద్దలు చేస్తున్న తప్పుడు పనులను ఖండించిన అసలైన భక్తులు క్రైస్తవుల్లో ఉన్నారు. గనుక ఆ తప్పులు క్రైస్తవ మతానివి కావు, అహంకార పూరితులైన కొందరు అధికారులు చేసిన తప్పులు అవి.
హిందూ జాగరణ సమితి ప్రశ్న :
మన భూమండలం 6,000 సంవత్సరాల క్రితం సృష్టించ బడిందని మీ గ్రంధం చెపుతున్నది, అది నిజం కాదని, భూమి వయస్సు కోట్లాది సంవత్సరాలని నేటి శాస్త్రజ్ఞులు భూగర్భంలో దొరికిన ఎముకలను, ఇతర పదార్దాలను "కార్బన్ డేటింగ్" ద్వారా పరీక్ష చేసి నిర్ణయిస్తున్నారు. దానికి మీరేమంటారు!
క్రైస్తవ పరిషత్ సమాధానం :

"భూమండలం 6,000 సంవత్సరాల క్రితం సృష్టించ బడింది" అని బైబుల్లో ఎక్కడ వ్రాయబడి ఉందొ జాగరణ సమితి వారు రెఫరెన్సు కూడా వ్రాస్తే బాగుండేది. జాగరణ సమితి వారి బైబుల్ పరిజ్ఞానం చాలా గొప్పది! వందలసార్లు బైబుల్ చదివిన మాకే కనిపించని సంగతులు బైబుల్లో జాగరణ సమితి వారికి  కనిపించాయి! బాబూ! బైబుల్లో  భూమి  వయస్సు  6,000 సంవత్సరాలని  ఎక్కడా చెప్పబడలేదు. ప్రస్తుత యుగం ప్రారంభమై దాదాపు  6,000 సంవత్సరాలు  అని  మాత్రమే  బైబుల్ చెబుతున్నది.
(మీ సమయాన్ని వెచ్చించి ఓపిగ్గా ఇంతవరకూ చదివిన మీకు మరోసారి ప్రత్యేక ధన్యవాదాలు. అందుబాటులో లేని వారికోసం ఇంకా మరికొన్ని మరలా కలిసాక)